మేడ్చల్ సెప్టెంబర్ 19 (ఇయ్యాల తెలంగాణ ): రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహన్ మేడ్చల్ లోని హోలీ మేరీ కళాశాలలోని ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ మరియు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్ మరియు మేడ్చల్ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ నిర్వహణ, భద్రత ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూము నుండి కౌంటింగ్ కేంద్రానికి చేరుకునే మార్గంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ఏర్పాటు చేయాల్సిన గార్డు వ్యవస్థ గురించి సూచనలు ఇచ్చారు. కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ అధికారుల కలవకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మెటల్ బారికేడ్ వ్యవస్థ యొక్క ప్రయోజనాలు వివరించి, వాటిని ఏర్పాటు చేసేలా ప్రత్యేక సూచనలు ఇచ్చారు. వరుసకు 7 టేబుల్ల చొప్పున రెండు వరుసలలో మొత్తంగా 14 కౌంటింగ్ టేబుల్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒక్కో నియోజకవర్గానికి కనీసం 25 రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తదనంతరం 15 ఎకరాల విశాలమైన పార్కింగ్ ప్రాంగణాన్ని కూడా పరిశీలించారు.
బస్సుల రాకపోకల్లో ఇబ్బందులు ఉండకుండా చూడాలన్నారు. ఈ పర్యటనలో గిరిధర్, ఐపిఎస్., ఎన్ వెంకట రమణ, అడిషనల్ డీసీపీ, వెంకట్ రెడ్డి, ఎసిపి, కుషాయిగూడ, ఇన్స్పెక్టర్,కుషాయిగూడ తదితర అధకారులు పాల్గొన్నారు.