హైదరాబాద్, జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ) : ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు క్షీర సాగరంలో శేషతల్పంపై శయనిస్తాడు. దీనినే తొలి ఏకాదశి అంటారు. శ్రీమన్నారాయణుడు ఈ ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశినాడు మేలుకొంటాడు. నెలలో రెండు ఏకాదశుల్లోనూ ఉపవాసం చేయడం వల్లశారీరక, మానసిక అనారోగ్యాలన్నీ తొలగిపోతాయని చెబుతారు. దేహం శక్తిమయం, ఉత్సాహభరితం అవుతుంది. ఉత్తరాయణానికి ముఖద్వారం ముక్కోటి ఏకాదశి అయితే, దక్షిణాయనానికి తలగుమ్మం తొలి ఏకాదశి. ఉత్తరాయణంలో దైవకార్యాలు, వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పరచింతనతో, మోక్షసాధనతో దేవరుణాన్ని తీర్చుకునే యజ్ఞయాగాదులకు ఉత్తరాయణం శ్రేష్ఠం. ఉత్తరాయణంలో మరణించినవారు సూర్యమండలాన్ని ఛేదించుకుని పునర్జన్మ లేని ముక్తిని పొందుతారు. పురాణగాథ ప్రకారం నారాయణుడు మురాసురునితో చాలాకాలం యుద్ధం చేస్తూ అలసిపోయాడు.
ఒక గుహలో విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ సమయంలో ఆయన దేహంలో నుంచి ఒక కన్య ఉద్భవించి, స్వామికి శ్రమ లేకుండా ఆ రాక్షసుణ్ణి సంహరించింది. మేలుకున్న మహావిష్ణువు సంతోషించాడు. ఆమెను ఏదైనా వరం కోరుకోమన్నాడు. యుగయుగాల ప్రజలందరి నోళ్లలో నిలిచేటట్లు నీకు ఇష్టమైనది ఏమైనా ఇమ్మని ఆమె ప్రార్థించింది. అప్పుడు నారాయణుడు, ‘‘నాకు ఇష్టమైన తిథి ఏకాదశి. దక్షిణాయనానికి ముందు వచ్చే ఏకాదశినాడు అందరూ నిన్ను తలచుకునేట్లు వరమిస్తున్నాను’’ అన్నాడు. అదే తొలి ఏకాదశి అయింది.