భాగ్యనగరంలో ఇయ్యాల బోనాలు
ఘటోత్సవం ` తొట్టెల ఊరేగింపు
సమృద్ధిగా వానలు కురవాలని, ప్రకృతి పచ్చగా ఉండాలని, అంతా ఆరోగ్యంగా వర్థిల్లాలని ప్రార్థిస్తూ ‘సాకబెట్టు’ పేరుతో పసుపు, వేపాకు, పచ్చకర్పూర, సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటితో శక్తిమాతలను అభిషేకిస్తారు. ఒక కుండ (ఘటం)ను చక్కగా అలంకరించి, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దానిపై ఉంచి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వెళతారు. ఘటోత్సవంతో పాటు పిల్లలు ఆరోగ్యంతో, పూర్ణాయుష్షుతో ఉండాలని కోరుకుంటూ ఉయ్యాల తొట్టెలను అమ్మవారికి సమర్పిస్తారు. వీటిని పూలతో తయారుచేస్తారు. వెదురుబొంగులను రంగురంగుల కాగితాలతో అలంకరిస్తారు.
ఇవి మూడు అంతస్తుల నుంచి ఏడు అంతస్తుల వరకూ ఉంటాయి. పండుగ ముగిసిన రోజు డప్పు వాయిద్యాలు, పాటలు, నృత్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు.ప్రకృతిని శక్తిస్వరూపిణిగా, జగన్మాతగా కొలవడం భారతీయ సంప్రదాయం. ప్రకృతిశక్తుల విభిన్న కళలే గ్రామదేవతలని దేవీ భాగవతంలో ఉంది. ప్రకృతి తల్లిలాంటిది. ఆ తల్లి ఒడిలో సేదతీరాలంటే ఆమెను పూజించాలి. అంటే ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాలి. మానవ మనుగడకు అదే శ్రీరామరక్ష. అందుకు భిన్నంగా వ్యహరించినప్పుడు, ప్రకృతి ప్రకోపిస్తే విపత్కర పరిణామాలు ఎదురుకాక తప్పదు. వాటిని అధిగమించేందుకు మారుతున్న రుతువులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వివిధ రూపాలు, పేర్లతో కొలువైన గ్రామదేవతలను వేడుకుంటూ జరుపుకునే పండుగే బోనాలు. ఏటా ఆషాడ మాస తొలి ఆదివారం బోనాల జాతర మొదలై ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క ప్రాంతంలో జరుగుతుంది. ప్రధాన ఆలయాలతో పాటు వాడవాడలా కొలువై ఉన్న గ్రామదేవతలను కాళీమాత రూపాలుగా పూజిస్తూ బోనాలు సమర్పించుకుంటారు. ఆషాడంలో ఆడబిడ్డ ఇంటికి వచ్చిన భావించి పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ? ఇలా శక్తి స్వరూపమైన అమ్మవార్ల వద్ద తమను చల్లగా చూడమని వేడుకుంటారు.
ఈ ఏడాది లాల్ దర్వాజ బోనాలకు సర్వం సిద్ధమైంది. పాతబస్తీలో కొలువైన సింహవాహిని మహంకాళి అమ్మవారికి జూలై 16 ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చి బోనం సమర్పంచనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భారీ సంఖ్యలో భక్తులతో పాటు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, తదితరులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. సోమవారం జులై 17న ఘటాల ఊరేగింపు, తొట్టెల జాతర, పలారం బండ్ల ఊరేగింపు జరగుతుంది.
అదే రోజ రంగం నిర్వహిస్తారు. భవిష్యవాణి వినేందుకు, ఘటాల ఊరేగింపును చూసేందుకు వేలాది భక్తజనం తరలివస్తారు. బోనాలు వేడుకలకు ప్రత్యేకంగా పొడవాటి కర్రలకు రంగు కాగితాలు అమర్చిన తొట్టెలు రూపొందిస్తారు. ఒక్కో బృందం ఒక్కో తొట్టెను అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు. అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత ప్రసాదం ఇంటికి తీసుకొచ్చి బంధుమిత్రులతో కలసి విందు ఆరగిస్తారు.