మైనంపల్లి రాజీనామా

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23, (ఇయ్యాల తెలంగాణ ); కొంతకాలంగా బీఆర్‌ఎస్‌ లో రెబల్‌గా మారిన మల్కాజ్‌ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉంటారా? పార్టీని వీడతారా? అని కొంత కాలంగా ఊగిసలాటలు నడిచిన సంగతి తెలిసిందే. కనీసం ఆయన అనుచరుల్లో కూడా క్లారిటీ లేకుండా ఉంది. తాజాగా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.బీఆర్‌ఎస్‌ పార్టీలో తనకు రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని మైనంపల్లి హనుమంతరావు కోరిన సంగతి తెలిసిందే. తన సిట్టింగ్‌ స్థానం మల్కాజ్‌ గిరి సహా, తన కుమారుడు మైనంపల్లి రోహిత్‌ కోసం మెదక్‌ స్థానం ఇవ్వాలని కోరారు. అందుకు అధిష్ఠానం ఒప్పుకోలేదు. కొద్ది వారాల క్రితం విడుదల చేసిన తొలి విడత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో కేవలం మైనంపల్లి హనుమంతరావుకు మాత్రమే టికెట్‌ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. నిజానికి అంతకుముందే మైనంపల్లి రెబల్‌ గా మారినప్పటికీ, అభ్యర్థుల ప్రకటనలో ఆయన పేరును తొలగించలేదు.తర్వాత తనకు పార్టీ కన్నా తన కుమారుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యమని మైనంపల్లి చాలా సందర్భాల్లో చెప్పారు. తాను కేసీఆర్‌, కేటీఆర్‌ చివరికి ఆ దేవుణ్ని కూడా లెక్క చేయబోనని అన్నట్లుగా ఆడియో టేప్‌లు కూడా వైరల్‌ అయ్యాయి. తనకు రెండు టికెట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ ను మాత్రం ఆయన వదల్లేదు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎదురుతిరిగి.. అసలు ఆయన పార్టీలో ఉంటారా? లేక కాంగ్రెస్‌ లో చేరతారా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు, మైనంపల్లి పైన బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం కూడా ఎలాంటి క్రమ శిక్షణ చర్యలు తీసుకోలేదు.మైనంపల్లి అడుగులు ఎటు వైపు వేస్తారో అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. తన భవిష్యత్‌ కార్యాచరణను ఆయన ఇప్పటిదాకా ప్రకటించలేదు. ఇప్పటికే రెండు సార్లు తన నిర్ణయాన్ని వాయిదా వేసిన మైనంపల్లి మంత్రి కేటీఆర్‌తో భేటీకి ఆవకాశం ఉన్నప్పటికీ ప్రయత్నించడం లేదు. సీఎం కేసీఆర్‌ను కలిసి స్పష్టమైన హావిూ తీసుకున్న తర్వాతే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ధిక్కార స్వరం వినిపించిన  మైనంపల్లిని ప్రోత్సహిస్తే.. ఇతరులు కూడా అదే పని చేసే అవకాశం ఉంటుందని అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదని నేతలు హైకమాండ్‌కు సూచిస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....