రాజస్థాన్‌ లో 3 రధయాత్రలు…

జైపూర్‌, ఆగస్టు 9, (ఇయ్యాల తెలంగాణ );మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న 5 రాష్ట్రాల్లో గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ క్రమంలో రాజస్థాన్‌లో రథయాత్రకు కాషాయపార్టీ శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో అగ్ర నేత లాల్‌ కృష్ణ అద్వాణీ చేపట్టిన రథయాత్ర ఆ పార్టీకి ఎంత మైలేజి తెచ్చిపెట్టిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూడా అదే పంథాలో ఒక రాష్ట్రంలో ఏకంగా మూడు రథయాత్రలు చేపట్టేలా కసరత్తు చేస్తోంది. రాష్ట్రానికి చెందిన ముగ్గురు అగ్రనేతలు మూడు దిక్కులా ఈ రథాలను పరుగులు తీయించనున్నారు. రాష్ట్రమంతటా చుట్టేసి, మూడు రథాలు రాష్ట్ర రాజధాని జైపూర్‌కు చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రథయాత్ర ముగింపును ఒక గ్రాండ్‌ ఈవెంట్‌లా నిర్వహించాలని, ఆ సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యేలా కసరత్తు చేస్తున్నారు.

రాజస్థాన్‌ సహా అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోనున్న మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి గెలుపు కీలకంగా మారింది. ఈ మధ్యనే జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం కమలనాథులకు చేదు పాఠంగా మిగిలింది. అంక గణితం ప్రకారం చూస్తే ఆ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతంలో పెద్దగా తేడా ఏవిూ రాలేదు. అటూ ఇటూగా గత ఎన్నికల్లో సాధించినన్ని ఓట్లు వచ్చాయి. కాకపోతే జనతాదళ్‌ (సెక్యులర్‌) బలహీనపడడం వల్ల ఆ పార్టీ ఓటుబ్యాంకు నుంచి 5 శాతం మేర కాంగ్రెస్‌కు అదనంగా వచ్చి చేరడంతో ఫలితాలు పూర్తిగా తారుమారయ్యాయి. ఎన్నికల లెక్కల్లో అంతిమంగా జనం చూసేది గెలుపు, ఓటములనే. కారణాలను విశ్లేషించుకోవాల్సింది రాజకీయ పార్టీలే. ఈ ఓటమి నేర్పిన పాఠంతో వెనువెంటనే జేడీ(ఎస్‌)తో చెలిమి యత్నాలను కమలనాథులు ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో ఓటమి ప్రభావం.. ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. అప్పటి వరకు పొరుగునే ఉన్న తెలంగాణలో క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిన పార్టీ గ్రాఫ్‌ కాస్తా ఒక్కసారిగా తిరోగమనం బాట పట్టింది. అప్పటి వరకు వరుస పరాజయాలు ఎదుర్కొంటూ వచ్చిన కాంగ్రెస్‌ పని ఇక అయిపోయినట్టే అన్న దశలో కర్ణాటక అందించిన తిరుగులేని విజయం, ఆ పార్టీలో నూతనోత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగింది. దేశవ్యాప్తంగా రాజకీయ సవిూకరణాలు కూడా చకచకా మారిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఇకపై జరిగే ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలనూ బీజేపీ తేలిగ్గా తీసుకోవడం లేదుగతంలోనూ సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు, అంటే 2018 చివర్లో చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయానికి మూడు రాష్ట్రాల్లో బీజేపీయే అధికారంలో ఉంది. చత్తీస్‌గఢ్‌లో రమణ్‌ సింగ్‌, మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ మూడు పర్యాయాలు ముఖ్యమంత్రులుగా కొనసాగుతూ వచ్చారు. రాజస్థాన్‌లో వసుంధర రాజే సీఎంగా ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ పరాజయం పాలైంది. మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది (మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా వర్గం చీలిక కారణంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోయి, మళ్లీ శివరాజ్‌ సీఎం అయ్యారు). అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొద్ది నెలలకే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పూర్తి భిన్నమైన ఫలితాలు వచ్చాయి. చత్తీస్‌గఢ్‌లో 11 లోక్‌సభ స్థానాలకు బీజేపీ 9 గెలుచుకోగా, కాంగ్రెస్‌ 2 మాత్రమే గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌లో 29 స్థానాలకు బీజేపీ 28 గెలుచుకోగా, కాంగ్రెస్‌ 1 సీటుకే పరిమితమైంది. రాజస్థాన్‌లోని 25 స్థానాలకు 24 బీజేపీ గెలుచుకోగా, మిగిలిన 1 స్థానంలో బీజేపీ మిత్రపక్షం, ఎన్డీఏ కూటమి భాగస్వామి అయిన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్పీ) గెలుచుకుంది. అంటే 25కి 25 సాధించి క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఆ రాష్ట్రాల ఓటర్లు అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు స్పష్టమైన తేడాను ప్రదర్శించారు. జాతీయ స్థాయిలో తాము ప్రధాని మోదీకే ఓటేస్తామని, రాష్ట్రస్థాయికి వచ్చేసరికి మాత్రం తమ స్థానిక పరిస్థితులు, స్థానిక ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేస్తున్నారని స్పష్టమైంది. అందుకే బీజేపీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికాంశాలకే ప్రాధాన్యతనిస్తూ ఓటర్ల మనసు గెలుచుకునే ప్రయత్నాలు చేస్తోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....