హైదరాబాద్, జూన్ 27 (ఇయ్యాల తెలంగాణ) : విష్ణు మంచు హీరోగా నటించిన సినిమా ‘కన్నప్ప’. కథ రాసింది కూడా ఆయనే. శ్రీకాళహస్తి ఆలయ స్థల పురాణం ఆధారంగా తీసిన చిత్రమిది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ కీలక పాత్రలు చేశారు. విష్ణు సరసన ప్రీతి ముకుందన్ నటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది?
కథ :
బాల్యంలో తిన్నడు (విష్ణు మంచు) స్నేహితుడిని అమ్మవారికి బలి ఇస్తారు. అప్పటి నుంచి దేవుడు లేడని మొక్కడం మానేస్తాడు. నాస్తికుడు అవుతాడు. తల్లి లేని బిడ్డ కావడంతో తండ్రి నాతనాథుడు (శరత్ కుమార్) కూడా కొడుకును ఏవిూ అనడు.తమ అడవిలో మరో గూడెంలో ఉన్న వాయు లింగం కోసం వచ్చిన కాలాముఖుడి (అర్పిత్ రంక) తమ్ముడిని చంపేస్తాడు. లక్షల సైన్యంతో వచ్చే కాలముఖుడిని ఎదుర్కొనడం కోసం నాతనాథుడు అడవిలో మిగతా వాళ్ళ మద్దతు కోరతాడు. తాను ప్రేమించిన నెమలి (ప్రీతి ముకుందన్) మరో గూడెం పెద్ద కుమార్తె అని తిన్నడికి తెలుస్తుంది. దేవుడు లేడని చెప్పే తిన్నడిని నెమలితో ప్రేమ ఎలా మార్చింది? ఆ ప్రేమ వల్ల ఎటువంటి యుద్ధం చేయాల్సి వచ్చింది? ఎవరికి దూరం అయ్యాడు? కాల ముఖుడిని ఎదుర్కొనే సమయంలో తిన్నడు ఏం కోల్పోయాడు? తిన్నడు నుంచి ‘కన్నప్ప’గా ఎలా మారాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. కన్నప్ప చరిత్ర తెలుగు పేక్షకులకు కొత్త కాదు. శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లే భక్తుల సంఖ్య తక్కువ కాదు. భక్తి భావంతో కొందరు చరిత్ర తెలుసుకుంటే… కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ చూసి తెలుసుకున్న ప్రేక్షకులు ఇంకొందరు. అందరికీ తెలిసిన కథను తెరపైకి తీసుకు రావడం అంత సులభం కాదు. అందులోనూ ‘బాహుబలి’ వంటి భారీ సినిమాలు చూసిన జనాలకు ఆ స్థాయిలో సినిమా అందించడం ఇంకా కష్టం. తెలిసీ విష్ణు మంచు రిస్క్ చేశారు.
ఆ రిస్క్ ఎలా ఉంది? అంటే…శివపార్వతుల సన్నివేశంతో ‘కన్నప్ప’ మొదలైంది. అయితే… భక్తి నుంచి భారీ యాక్షన్, రక్తి రూటులోకి రావడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. చిన్నప్పటి నుంచి మనం విన్న, చదివిన, చూసిన కన్నప్ప కథేనా? అనే స్థాయిలో తెరపై గ్రాండియర్ విజువల్స్, లార్జ్ ల్యాండ్ స్కేప్స్, యాక్షన్ సీక్వెన్స్ కళ్ల ముందు మెదులుతాయి. ఓ కథకుడిగా, కథానాయకుడిగా, నిర్మాతగా ‘బాహుబలి’ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కు ఇవ్వడానికి విష్ణు మంచు ట్రై చేశారు. ఆయన ప్రయత్నంలో నిజాయితీ ఉంది. కానీ, ఆ స్థాయిలో తెరపైకి తీసుకు రావడంలో ముఖేష్ కుమార్ సింగ్ ఫెయిల్ అయ్యాడు. భక్తిలో రక్తిని మిళితం చేసి మెప్పించడం ఆయనకు రాలేదు. సన్నివేశంలో ఎమోషన్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా తీయడంలో దర్శకుడితో పాటు సంగీత దర్శకుడు స్టీఫెన్ ఫెయిల్ అయ్యారు.దర్శకుడికి హిందీలో ‘మహాభారత్’ సీరియల్ తీసిన అనుభవం ఉంది. అయితే ఈ కథను తెరపైకి తీసుకు వచ్చేటప్పుడు క్రిస్పీగా చెప్పడం అవసరం. సన్నివేశాన్ని వీలైనంత క్లుప్తంగా, ఎఫెక్టివ్గా తీయడం ముఖ్యం. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథను కాస్త ఎక్కువ సేపు చెప్పారు. పాటలు తీసిన విధానం, బాణీలు బావున్నా కథ ` సినిమా నిడివి పెంచాయి తప్ప ఎంగేజ్ చేయలేకపోయాయి. అయితే స్టార్స్ అందరినీ వాడుకున్న తీరు బావుంది. తెరపై అక్షయ్ ` కాజల్, ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు వచ్చిన ప్రతి సన్నివేశాన్ని బాగా తీశారు. ‘కన్నప్ప’ ఫస్టాఫ్ సోసోగా అనిపిస్తుంది. సెకండాఫ్ ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా స్వరూపం ఒక్కసారిగా మారింది. అది చివరి వరకు కంటిన్యూ అయ్యింది.టెక్నికల్ పరంగా ‘కన్నప్ప’లో కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. అదీ వీఎఫ్ఎక్స్ ` సీజీ వర్క్స్ పరంగా! పైన చెప్పినట్టు ఫస్టాఫ్లో కొన్ని చోట్ల తెలుస్తుంది. అది పక్కన పెడితే… పతాక సన్నివేశాల్లో బాగా చేశారు. సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణంలో రాజీ పడలేదు. సంగీత దర్శకుడిగా స్టీఫెన్ బదులు వేరొకరిని తీసుకుంటే చాలా బావుండేది. ఒక్క క్లైమాక్స్ తప్ప మిగతా సినిమా అంతా ఆర్ఆర్ పరంగా వీక్ వర్క్ ఇచ్చారు. యాక్షన్ సీన్స్, ప్రభాస్ ` విష్ణు మంచు సన్నివేశాల్లో నేపథ్య సంగీతానికి స్కోప్ ఉంది. అక్కడ సరిగా చేయలేదు. అన్నిటి కంటే ముఖ్యంగా డివోషనల్ టచ్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు స్టీఫెన్.
కన్నప్ప’ను రెండు కోణాల్లో చూడాలి. చూసే ప్రేక్షకులలోనూ రెండు అభిప్రాయాలు ఉంటాయి. ఒకటి… భారీ స్థాయిలో ఎలా తీశారని! రెండు… భక్తి భావం ఎంత ఉందని! రెండు అంశాల్లోనూ సినిమా సర్ప్రైజ్ చేస్తుంది. శివ పార్వతుల మధ్య సంభాషణలు, పతాక సన్నివేశాల్లో విష్ణు మంచు ` మోహన్ బాబు మధ్య సంభాషణలు బావున్నాయి. అయితే… లెంత్ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్. రెండున్నర గంటల్లో ఈ కథను చెబితే చక్కగా ఉండేది.నటుడిగా విష్ణు మంచుసెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. క్యారెక్టర్ కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లో మంచి ఎలివేషన్స్ పడ్డాయి. తెరపై విష్ణును చూస్తున్నామనేది మర్చిపోయి కేవలం సన్నివేశాలతో కనెక్ట్ అయ్యేలా ఎమోషనల్ టచ్ ఇచ్చారు. నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ నటన కంటే గ్లామర్ ఎక్కువ హైలైట్ అవుతుంది.సినిమాలో నటీనటులు అందరూ ఒకెత్తు… ప్రభాస్ ఒక్కరే ఒకెత్తు! ఎంట్రీ నుంచి ఎండ్ వరకు ప్రభాస్ తెరపై కనిపించిన ప్రతిసారీ ఒక వైబ్ క్రియేట్ అవుతుంది. ఆ పాత్రకు ప్రభాస్ వంద శాతం న్యాయం చేశారు. ప్రభాస్ను ‘నీకు పెళ్లయిందా?’ అని విష్ణు అడిగే సన్నివేశానికి థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. మోహన్ బాబును డైలాగ్ కింగ్ అని ఎందుకు అంటారో, నటుడిగా ఆయన ప్రతిభను ఈతరం ప్రేక్షకులకు సైతం చెప్పే చిత్రమిది. మోహన్ లాల్ ఒక్క సీన్ చేశారు. అక్షయ్ ` కాజల్ జంట శివ పార్వతులుగా ఒదిగిపోయారు. శరత్ కుమార్ నటన బావున్నా… డబ్బింగ్ ఇబ్బంది పెట్టింది. బ్రహ్మాజీ, రఘుబాబు, సప్తగిరి, సురేఖా వాణి వంటి నటులు ఉన్నా వాళ్లకు సరైన సన్నివేశాలు పడలేదు.ప్రభాస్ కోసం వెళ్లిన అభిమానులు కావచ్చు, అక్షయ్ కుమార్ ` మోహన్ లాల్ వంటి స్టార్స్ కోసం వెళ్లిన ప్రేక్షకులు కావచ్చు… థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పతాక సన్నివేశాల్లో విష్ణు మంచు నటన గురించి తప్పకుండా మాట్లాడతారు. నటుడిగా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. విష్ణు కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఏవిూ ఆశించకుండా తనకు పూజలు చేసిన భక్తులకు భగవంతుడు ఎప్పుడూ అండగా నిలబడతాడని చెప్పే చిత్రమిది. ప్రేక్షకులు ఏవిూ ఆశించకుండా వెళితే సర్ప్రైజ్ చేస్తుంది. అంచనాలతో వెళితే శాటిస్ఫై చేస్తుంది. ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్, ఆయన క్యారెక్టర్ ` క్లైమాక్స్ ` విష్ణు నటన థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా గుర్తు ఉంటాయి.