
హైదరాబాద్, జూన్ 26, (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ వాసులు ఇప్పుడు చేపల గురించే ఆలోచిస్తూ భయపడుతున్నారు. తినడానికి కాదు.. చూస్తేనే వెన్నులో జలదరింపు రాకుండా ఉండటం లేదు. చెరువుల మధ్యే జీవితం గడిపే మత్స్యకారులే ఇప్పుడు వల వేసేటపుడు వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకంటే వలలో పడేది మనకు ఉపయోగపడే చేపలు కాదు.. ఏకంగా ‘రాకాసి’ చేపలే! ఎక్కడ చూసినా ఇవే.. వాటి పేరు చెబితేనే మిగతా చేపలు దూరంగా పారిపోతాయంట. శరీరానికి కంచు కవచంలా ఉన్న ఆకారంతో, పిల్లలు కాదు పెద్దవాళ్లకూ భయం వేసేలా ఉన్న ఆ చేపలు ఇప్పుడు హైదరాబాద్ చెరువుల్లో వేట మొదలుపెట్టాయి. అసలు ఈ చేపలను చూసి మత్స్యకారులే తట్టుకోలేక కాల్చేసే దాకా వెళ్లారంటే.. అసలు వ్యవహారం ఎంత తీవ్రమో విూరు ఊహించగలరు. అసలు విషయంలోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది జీవనోపాధిగా చేపల వేటను ఆధారంగా చేసుకుంటున్నారు. చెరువులు, నదులు, వాగులు ఇవన్నీ మన మత్స్యకారుల కడుపు నింపే జల వనరులు. కానీ తాజాగా హైదరాబాద్లోని చర్లపల్లి చెరువు వద్ద భయానక మాంసాహారి చేపల కలకలం నెలకొంది. మత్స్యకారులు వలలు వేసినప్పుడు టన్నుల కొద్దీ ఆర్మర్డ్ సెల్ఫిన్ క్యాట్ ఫిష్ అనే ఓ విచిత్రమైన చేపలే చిక్కుతున్నాయి. ఇవి సాధారణ చేపలు కావు. వీటిని డెవిల్ ఫిష్, లేక రాకాసి చేపలు అంటారు. ఇప్పుడు ఇవి ఇతర చేపలను నాశనం చేస్తూ తీవ్రంగా విస్తరిస్తున్నాయి.
చర్లపల్లి చెరువు వంటి నీటి వనరుల్లో ఈ డెవిల్ ఫిష్ అనూహ్యంగా పెరిగిపోతుండడం, ఇతర జీవజాతుల కోసం ముప్పు సంకేతం. మత్స్యశాఖ అధికారులు దీన్ని ప్రాణాంతకంగా పేర్కొంటున్నారు. ఈ చేపలు లారీ కారిడ్ కుటుంబానికి చెందినవి. ఇవి ఇతర చేపల గుడ్లను, పిల్లలను తినేస్తూ పరిసరజలాల్లో ఏకంగా దేనినైనా తినే శక్తిని కలిగి ఉన్నాయి. ఒకసారి ఈ చేపలు చేరిన నీటిలో, మరెంత మంచి విత్తన చేపలు వేసినా అవి బతకలేవు. ఈ డెవిల్ ఫిష్ వాటిని తినేసి స్వయంగా పెరిగిపోతాయి. దీనివల్ల మిగిలిన సంప్రదాయ చేపల జాతులు అంతరించి పోతున్నాయని మత్స్యకారులు అంటున్నారు. వీటి అత్యాధునికమైన లక్షణం.. ఇవి తక్కువ ఆక్సిజన్ ఉన్న నీటిలో కూడా జీవించగలవు. అంతే కాదు, నీటికి బయటకు వచ్చినా, కొంత సమయం పాటు గాలిని నేరుగా పీల్చుకుంటూ బతికే శక్తి వీటిలో ఉంది. ఇది ఒక విధంగా చెరువుల టెర్మినేటర్ లా పనిచేస్తోంది. ఈ ప్రత్యేకతలే వీటిని మరింత ప్రమాదకరంగా మార్చాయి. చాలా మంది మత్స్యకారులు వలలు వేసిన ప్రతిసారీ ఈ చేపలే ఎక్కువగా పడుతుండటంతో, వారి ఆదాయ మార్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ చేపలు అసలు మన చెరువుల్లోకి ఎలా వచ్చాయి? అనేది మరో ఆసక్తికర ప్రశ్న. సమాచారం ప్రకారం, మొదట ఇవి అక్వేరియమ్ చేపలుగా బయట దేశాల నుంచి దిగుమతి అయ్యాయి. అప్పుడు పెద్దవవుతున్న కొద్దీ కొంతమంది వాటిని కాలువల్లోకి వదిలేశారు. అక్కడి నుంచి చిన్నకాలువల ద్వారా చెరువుల్లోకి ప్రవేశించాయి. ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పే దిశగా సాగుతోంది. వీటిని ప్రభుత్వ వైపు నుంచి సరఫరా చేసిన మంచి విత్తన చేపలు తినేస్తుండటంతో ప్రభుత్వ పెట్టుబడులే నష్టమవుతున్నాయి. ఇదే విషయంపై మత్స్యకారులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వలల్లో మనకు అవసరమైన రొయ్యలు, బంగరు తీల, కొరమెన, తిలపియా వంటి చేపల బదులు ఇప్పుడు ఈ ఆక్రమణ చేపలే పడుతున్నాయని వాపోతున్నారు. బజార్లో ఇవి విలువ ఉండకపోవడంతో అమ్ముడుపోయే అవకాశాలు తక్కువ. పైగా ఇంట్లో తినే అలవాటు కూడా లేదు. దీంతో ఆ చేపలను రోడ్లపైకి తీసి కాల్చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇది చూస్తుంటే గుండెను కలిచివేసే దృశ్యం. కానీ మిగిలిన చేపల రక్షణకై ఇది తప్పనిసరి చర్యగా మారిందని వారి మాట. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డెవిల్ ఫిష్ నాశనం చేసే విధానాన్ని పటిష్టంగా అర్థం చేసుకొని, వాటిని పూర్తిగా తొలగించే వ్యూహం రూపొందించాలి. అవసరమైతే శాస్త్రీయంగా తగిన మందులు, వ్యర్థజల నియంత్రణ చర్యలు చేపట్టాలి. మత్స్యకారులకు మార్గనిర్దేశం చేయాలి. ఒక వేళ ఇది నిర్లక్ష్యం చేస్తే, తెలంగాణ రాష్ట్రంలోని చాలా చెరువులు భవిష్యత్తులో చేపలేని నీటి బావులుగా మారే ప్రమాదం ఉందని కొందరి అభిప్రాయం. పర్యావరణం, జీవవైవిధ్యం, గ్రావిూణ జీవనోపాధి.. ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఒకటిపై ముప్పు వస్తే అన్నిటిపై ప్రభావం పడుతుంది. చర్లపల్లి చెరువు ఘటన ఇప్పటికైనా సైరన్ లా ప్రభుత్వానికి, పర్యావరణ నిపుణులకు హెచ్చరికలా ఉండాలి. మత్స్యకారులు లాంటివారు రోజూ జీవనోపాధికోసం చెరువులోకి వెళ్లి ఈ రాకాసి చేపల ముప్పుతో ఎదురైతే, వారి జీవితం నరకంగా మారిపోతుంది. మొత్తానికి, చెరువుల్లోకే చొచ్చుకుపోయిన ఈ డెవిల్ ఫిష్ అన్నిటికంటే ముందుగా మన తెలివిని పరీక్షిస్తున్నాయి. మనం శాస్త్రీయంగా స్పందిస్తే తప్ప, భవిష్యత్తులో మన పిల్లలు చేపలంటే ఫోటోలే చూస్తారు తప్ప చెరువుల్లో కాదు. అందుకే ఈ రాకాసి చేపలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. మొత్తం విూద హైదరాబాద్ నగరాన్ని రాకాసి చేపలు భయపెడుతున్నాయని ఒక్క మాటలో చెప్పవచ్చని మత్స్యకారుల మాట