హైదరాబాద్, జూన్ 25 (ఇయ్యాల తెలంగాణ) : మలక్ పేట్ నియోజకవర్గం సైదాబాద్ ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు స్థానిక ప్రజలకు శాపంగా మారింది. రెండేళ్ల కాల వ్యవధిలో పూర్తి కావలసిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఐదేళ్లు కావస్తున్న ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజల టాపిక్ సమస్యల పరిష్కారం కోసం నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఏళ్ల పాటు సాగుతూ ప్రజలకు మరిన్ని ట్రాఫిక్ కష్టాలను మిగులుస్తుంది.
దాంతో అధికారుల తీరు కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిన చందంగా తయారయింది. 2020 జూలైలో అప్పటి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభించారు. రెండేళ్లలో నిర్మాణం పూర్తవుతుందని ఆయన అప్పుడే బహిరంగంగానే ప్రకటించారు.అయినా ఇప్పటికీ సైదాబాద్ లో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తికాలేదు.ఇక్కడి ఆలయ వివాదం కారణంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు మరల ఎప్పుడు మొదలవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. 524 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సుమారు మూడు కిలోవిూటర్ల మేర నిర్మిస్తున్న ఈ సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే నగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయం రక్షణ రంగ సంస్థల ఉద్యోగులు, శ్రీశైలం కర్నూల్ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. అంతేకాకుండా ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న అవాంతరాలు తొలగించి త్వరలో నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు.