జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్
జగిత్యాల, మే 16 (ఇయ్యాల తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు వచ్చే విద్యార్థులకు మెరుగైన విద్య బోధన అందించేందుకు పటిష్ట కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ హైస్కూల్ జడ్పీహెచ్ఎస్ బాలురు, జడ్.పి.హెచ్.ఎస్ బాలికల పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నిర్వహించిన వేసవి శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ విద్యాశాఖలో ఒకే రోజు తో మార్పు సాధ్యం కాదని, నిర్విరామంగా ప్రయత్నం జరుగుతూ ఉండాలని అన్నారు.టీచర్ వృత్తి లో మనం కొనసాగడానికి ఒకే కారణం ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పిల్లలు మాత్రమేనని, నీరుపేద రైతులు, కూలీలు, బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల జీవితాలను బాగు చేసే అవకాశం మనకు లభించిందని అన్నారు.
భారత దేశంలో యువతకు మంచి విద్య నైపుణ్యం అందించగలిగితే సూపర్ పవర్ గా ఎదుగుతామని అన్నారు. చదువుకునేందుకు సామర్థ్యం లేని పిల్లలు మన దగ్గర ఎవరూ లేరని,సమాజంలో మంచి పునాది ఉండాలంటే ఉపాధ్యాయులు కీలకమని అన్నారు.జిల్లాలోని ఉపాధ్యాయులకు మే 13 నుంచి మే 31 వరకు కంటెంట్ ఎన్ రిచ్మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైఫ్ స్కిల్స్ లెర్నింగ్ అవుట్ కమ్స్ వంటి అంశాల పై గణిత , సోషల్ మండల రిసోర్స్ పర్సన్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఐఆర్పీ లకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.ఉపాధ్యాయులంతా చిత్తశుద్ధితో కృషి చేస్తే విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పు వస్తుందని, వేసవి శిక్షణలో నేర్చుకున్న అంశాలను బోధనలో ఉపాధ్యాయులు అమలు చేయాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాములు, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.