TSRTCలో డ్రెస్‌ కోడ్‌…

హైదరాబాద్‌, మే 14 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ అధికారులు వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇకపై సంప్రదాయ వస్త్రధారణ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. జీన్స్‌ ఫ్యాంటులు, టీ షర్టులు ధరించి ఉద్యోగులు విధులకు హాజరు కావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. అలాంటి వస్త్రధారణలో సంస్థ గౌరవానికి భంగం కలుగుతుందని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని సజ్జనార్‌ తెలిపారు. ఇప్పటిదాకా ఆర్టీసీ డ్రైవర్లు, కండెక్టర్లు కేవలం ఖాకీ డ్రెస్‌ లో మాత్రమే కనిపించేవారు. ఇక చెక్కింగ్‌ అధికారులు, సూపర్‌ వూజర్లు అంతా తెల్లటి వస్త్రాలు ధరించేవారు. అయితే డిపోలు, ఆర్టీసీ కార్యాలయాలలో పనిచేసేవారికి ఒక ప్రత్యేకమైన యూనిఫాం అంటూ లేదు. దీంతో వాళ్లు క్యాజువల్‌ వస్త్రధారణతో తమ విధులకు హాజరయ్యేవారు. ఈ విసయంపై ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు లేకపోవడంతో రంగురంగుల జీన్స్‌ ఫ్యాంట్లు, కలర్‌ ఫుల్‌ టీ షర్టులు ధరించి విధులకు హాజరవుతూ వస్తున్నారు.వీళ్లే కాదు టీఎస్‌ ఆర్టీసీలో పనిచేసే పెద్ద పోస్టులలో ఉండే ఉన్నతాధికారులు కూడా క్యాజువల్‌ డ్రెస్సులతో వస్తున్నారు. అయితే ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఈ విసయాన్ని సీరియస్‌ గా తీసుకున్నారు. ఇటీవల ఆయన తరచూ అధికారులతో గూగుల్‌ సమావేశాలు నిర్వహిస్తు న్నారు. కొన్ని సందర్భాల్లో డిపో స్థాయి సిబ్బందితో కూడా ఆన్‌లైన్‌ సమావేశాల్లో ముచ్చటిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఉన్నతాధికారులు మొదలు డిపో స్థాయి సిబ్బంది వరకు జీన్స్‌ ప్యాంట్లు, టీ షర్టుల్లో కనిపిస్తున్నారు. ఇది ఆయనకు చికాకు తెప్పించింది.దేశంలోనే పేరున్న రవాణా సంస్థలో ఇలా ఇష్టం వచ్చిన వస్త్రధారణతో అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొనటాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదే విషయాన్ని ఆయన ఈడీ ‘అడ్మిన్‌) దృష్టికి తీసుకెళ్లారు.

 ఈమేరకు తాజాగా ఈడీ (అడ్మిన్‌) లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. సంస్థకు ఉన్న పేరు, డిపో కార్యాలయాల గౌరవానికి వారి డ్రెస్సింగ్‌ భంగంగా ఉందంటూ ఆయన అందులో అభిప్రాయపడ్డారు. ఇక నుంచి గౌరవప్రదంగా ఉండే ఫార్మల్‌ డ్రెస్సుల్లోనే అధికారులు విధుల్లో కనిపించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆయా అధికారుల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ యూనిఫాంలో కనిపిస్తారు. కొన్ని బస్సుల్లో నీలి రంగు యూనిఫాం ఉంటోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించింది. ఆర్టీసీలో అతిపెద్ద సమ్మె విరమణ తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో సిబ్బంది యూనిఫాంపై ప్రస్తావించారు. మహిళా కండక్టర్లకు యాప్రాన్‌ అందజేస్తామని చెప్పి.. ఆ యాప్రాన్‌ ఏ రంగులో ఉండాలో నిర్ధారించేందుకు ఓ కమిటీ వేశారు. రెండు మూడు సమావేశాలు నిర్వహించిన తర్వాత, మెరూన్‌ రంగులో ఉండే యాప్రాన్‌ను సిఫారసు చేశారు. ఆ మేరకు ఓ ప్రముఖ కంపెనీకి వస్త్రం కొనుగోలు ఆర్డర్‌ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ యాప్రాన్‌ కూడా కనిపించటం లేదు. డ్రైవర్లు, కండక్టర్లకు యూనిఫాం కూడా కొన్నేళ్లపాటు సరఫరా కాలేదు. వారికి ఖాకీ బదులు మరో రంగు ఇవ్వాలన్న అంశం కూడా తెరమరుగైంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....