సింహాలకు ఆహారం వేసే ముందు ఎన్ క్లోజర్ ను శుభ్రం చేస్తున్న ఆనిమల్ కీపర్ పై 8 ఏళ్ల ఆడ సింహం దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సింహం దాడిలో ఆనిమల్ కీపర్ హుస్సేన్ చేతులు, ఛాతి భాగంలో గాయాలయ్యాయి. వివరాలలోకి వెళితే… నెహ్రూ జూలాజికల్ పార్కులో ఎప్పటిలాగానే సోమవారం సందర్బంగా ఈ నెల 8 వ తేదీన కూడా సెలవు దినం ప్రకటించింది. అయితే సింహాల ఎన్ క్లోజర్ లో గత కొంత కాలంగా ఉడంగడ్డకు చెందిన హుస్సేన్ (40) ఆనిమల్ కీపర్ గా పని చేస్తున్నాడు. ఎప్పటి లాగానే సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో హుస్సేన్ సింహాలు ఉండే ఎన్ క్లోజర్ వద్దకు వెళ్ళాడు. సింహాలకు ఆహారం గా మాంసం వేసే క్రమంలో ముందుగా అనిమల్ కీపర్ లు ఎన్ క్లోజర్ లను శుభ్రం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆనిమల్ కీపర్ హుస్సేన్ 8 ఏళ్ల ఆడ సింహం శిరీష ఉన్న ఎన్ క్లోజర్ వద్దకు వెళ్లి ముందుగా డాన్ని పక్క ఎన్ క్లోజర్ లోకి పంపించాడు. కానీ ఆ ఎన్ క్లోజర్ గడియ బోల్ట్ పెట్టడం మరిచిన హుస్సేన్ శుభ్రం చేస్తుండగా ఒక్క సరిగా ఆడ సింహం శిరీష తిరిగి తన ఎన్ క్లోజర్ వద్దకు వచ్చేసింది. ఒక్కసారిగా హుస్సేన్ పై పంజా విసిరింది. అంత దూరంలో పడిపోయిన హుస్సేన్ భయంతో ఎన్ క్లోజర్ గేట్ బోల్ట్ పెట్టకుండానే బయటికి పరుగులు తీశాడు. దీంతో ఆ ఆడ సింహం కూడా ఎన్ క్లోజర్ నుంచి బయటికి వచ్చింది. సమాచారం అందుకున్న జూ అధికారులు వెటర్నరీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగం లోకి దిగిన వెటర్నరీ సిబ్బంది డాట్ పద్దతి ద్వారా ఆడ సింహం శిరీష కు మత్తు ఇచ్చారు. అనంతరం ఆ సింహాన్ని ఎన్ క్లోజర్ లోకి వదిలేశారు.
గాయపడిన ఆనిమల్ కీపర్ హుస్సేన్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హుస్సేన్ చేతులకు, ఛాతికి గాయాలయ్యాయి.